Pages

Saturday, February 19, 2022

మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరలో గుస్సాడీ, దండారి నృత్యాల సందడి


Hyderabad :మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరలో  గుస్సాడీ, దండారి నృత్యాలు  సందడి చేశాయి. మేడారం శ్రీసమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా మూడవరోజు శుక్రవారం గిరిజన మ్యూజియం వద్ద గల శ్రీ సమ్మక్క-సారలమ్మ ఆదివాసి కళావేదికలో ఆదివాసీ  గిరిజన కళాకారులచే ప్రదర్శించబడిన ప్రదర్శించిన గుసాడి మరియు దండారి నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 20 మంది సభ్యులుగా గల కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన పద్మశ్రీ కనకరాజు శిష్యరికంలో తర్ఫీదు పొందిన కనక వెంకటేష్ నాయకత్వంలోని చేతిలో దండ(కర్ర) పట్టుకొని తలపై నెమలి ఈకలతో ప్రత్యేకంగా రూపొందించిన టోపీని, శరీరానికి పులి చర్మాన్ని పోలిన దుస్తులను ధరించి,  కాళ్ళకు గజ్జలు కట్టి ఆదివాసీ గిరిజన గుస్సాడి కళాకారులు బూర, డోలు వాయిద్యాల చప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలు చేశారు.

ముఖాడే విష్ణు నేతృత్వంలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి, సిర్పూర్ (యు) మండలం  పవార్ గూడ గ్రామాలకు చెందిన 25 కళాకారులతో కూడిన  ఆంద్ గిరిజన సంఘం కళాకారులు ఆంద్ గిరిజన భాషలో పాటలు పాడుతూ వివిధ వేషధారణలో చేసిన  దండారి  నృత్యం శ్రీ సమ్మక్క-సారలమ్మ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా గోండు గుస్సాడీ కళాబృంద నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాలలో గోండు దేవతలను పూజిస్తూ గుస్సాడి నృత్యాలు చేస్తామని అన్నారు. గోండు గిరిజనుల సంస్కృతిలో భాగమైన గుస్సాడి నృత్యాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో శ్రీ మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో ప్రదర్శించినట్టు తెలిపారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, చత్తిష్ ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు ఈ నృత్యాలను చూసి పరవశించారు.







No comments:

Post a Comment